మూతబడిన బడి.. మళ్లీ సందడి
లక్ష్మీపురం బడికి కొత్త ఊపు
కల్లూరు, ఆగస్టు 05 (విజయక్రాంతి): ఒకప్పుడు విద్యార్థుల కొరతతో మూతపడిన లక్ష్మీపురం( Lakshmipuram school) ప్రభుత్వ పాఠశాల,నేడు చిన్నారుల సందడితో మళ్లీ జీవం పొందింది. గ్రామ సర్పంచ్ భూక్య రవీందర్ ముందడుగు,గ్రామస్తులు, విద్యాభిమానులు,విద్యాశాఖ అధికారుల సమిష్టి కృషితో పాఠశాల పునఃప్రారంభమైంది.ప్రారంభంలో ఒక్క విద్యార్థితో ప్రారంభమైన ఈ బడి,ప్రస్తుతం ఎనిమిది మంది చిన్నారులతో కొనసాగుతోంది.
ఉపాధ్యాయుడు బానోతు లక్ష్మణ్ అంకితభావంతో బోధన అందిస్తూ,ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.సరళమైన బోధనా విధానాలు,పరిశుభ్రమైన వాతావరణం,ఆటల ద్వారా అభ్యాసం వంటి చర్యలతో తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి, విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి.గ్రామస్తుల సహకారం,ఉపాధ్యాయుల కృషి కలిస్తే మూతపడిన బడులు కూడా మళ్లీ నిలదొక్కుకోగలవని లక్ష్మీపురం పాఠశాల ఉదాహరణగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను చేర్చి బడిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.






