07-04-2025 12:00:00 AM
పది పదిహేనేళ్ళ కిందటి సంగతి. నేను ఆ సాయంకాలం గోదావరి ఎక్స్ప్రెస్కు హైదరాబాదు ప్రయాణం అవుతూ పెట్టె సర్దుకుంటున్న సమయంలో మా ఆవిడ వొచ్చి“ఎవరో అబ్బాయి మీ కోసం వొచ్చి వీథిగుమ్మంలో నుంచున్నాడు” అంది. “ఎవరో అబ్బాయి అనకపోతే పేరూ, వూరూ కనుక్కుని మరీ చెప్పొచ్చుగా” అని విసుక్కున్నాను.“విజయనగరంట. మీ క్లాసుమేటు సోమనాథం గారి అబ్బాయట. పేరు ఆంజనేయులు” అని మళ్ళీ వెళ్ళి కనుక్కొచ్చి చెప్పింది.
“మీరు హైదరాబా దు వెళ్తున్నారని నాన్నగారికి తెలిసింది. మిమ్మ ల్ని కలవమని పంపించేరు” అన్నాడు.
“పాయింటుకి రా నాయనా, బండికి ఇం కా అరగంట కన్నా టైం లేదు” అని కఠినమైన మాట మృదువుగా అన్నాను.
“నేను కాలేజీలో చదువుకుంటూ సాయంకాలం పూట సంగీతం కాలేజీకి వెళ్లి మృదంగం నేర్చుకున్నానండి. ఆ చదువులో రాణించలేదు గానండీ, మృదంగంలో డిప్లొమా వచ్చింది. పక్క వాద్య కళాకారుడుగా గుర్తింపు వొచ్చింది.”
“నేను ఆరు రోజులు పోయాక హైద్రాబాదు నుంచి వస్తాను. కావాలంటే ఏదో రోజుని విజయనగరం వస్తాను. అప్పుడు వింటానేం?”
“అక్కర్లేదండి. ఇరవై రోజుల కిందట ఒక ఎడ్వర్టయిజుమెంటు వచ్చిందండి. ప్రభుత్వం వారి సంగీత నృత్య కళాశాలల్లో మృదంగం చెప్పేందుకు లెక్చరర్లు కావాలని. నేను దరఖాస్తు చేసేనండి. డైరెక్టరాఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఆ ఉద్యోగాలిస్తారండి. మరేమోనూ, ఇప్పుడున్న డైరెక్టరు గారు ఆయన కొత్తగా అపాయింట్ అయినప్పుడు ట్రైనింగుకి మీ దగ్గిర చేరిన అహమ్మద్ గారండి. నా గురించి ఒక్కమాట మీరు ఆయనతో చెబితే నాకా ఉద్యోగం వస్తుందండి. ఇదుగో నాన్న మీ పేరిట రాసిన లెటరండి. ఇదుగో నా అప్లికేషను కాపీ, నా అర్హతల జాబితానండీ.”
అన్నీ ఒక కవరులో ఉన్నాయి. ఇలా పైకి లాగి అలా కవర్లోకి తోసేశాడు.
“మీరు హడావిడిలో ఉన్నారండి. రైల్లో చదువుకోవచ్చండి. మీరు సామాను సర్దుకునేలోగా ఆటో పిల్చుకు రానాండీ?” అన్నాడా అబ్బాయి.
సోమనాథంతో కాలేజీ చదువు తరవాత ఎక్కువ పలకరింపులు లేకపోయినా అతని కొడుకు తన గురించీ తనకి కావలసిన దాన్ని గురించీ చకచకా చెప్పడం నాకు నచ్చింది. హైదరాబాదులో నాకు అహ్మద్ గారితో ఏమీ పనిలేదు. కాని, సీనియర్ ఐ.ఏ.ఎస్. ఆఫీసరైనా సరే, ఎక్కడయినా కనపడితే గురూజీ అనడం అతని లక్షణం. అందుకని పని గట్టుకుని ఆ ఆఫీసుకి వెళ్ళేను. అహ్మద్ గారు నాకు బాగా మర్యాదలూ అవీ చేసేడు గాని ‘ఆంజనేయులికి ఆ ఉద్యోగం రాదని’ అంతకంటే మర్యాదగా చెప్పేశాడు.
ఆంజనేయులు ఐదేళ్ళ తరవాత నాకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద కనిపించేడు, నేను ఒకానొక రైలు దిగి స్టేషనులోంచి బైట పడ్డానికి ప్లాట్ఫారం మీద నడుస్తుండగా.
అప్పుడతను రైల్వే బుక్ స్టాల్కు ఎదురుగా వున్న ఖాళీ జాగాలో నేలమీద దుప్పటి పరుచుకుని దానిమీద కూచుని మృదంగం వాయిస్తున్నాడు. నేనతన్ని వెంటనే గుర్తు పట్టి అక్కడ ఆగేను.
“ఏమిటబ్బాయీ, ఈ దుర్గతి?” అన్నాను.
“దుర్గతి ఏమీ లేదండి. ఇవాళ సాయంకాలం ఇక్కడ ఆంధ్రా భవన్లో చిత్తూరు అళగేశన్ గారి గాత్ర కచేరీ వుందండి. దానికి పక్క వాద్యం నాదండి. అయితే ఫలానా తేదీని, ఫలానా రైలులో, ఫలానా కంపార్టుమెంటులో, ఫలానా బెర్తులో వస్తున్నానని ఆ ఆర్గనైజర్సుకి తెలియపర్చినా, నన్ను రిసీవు చేసుకోడానికి ఎవరూ రాలేదండి. అందుకని వాళ్లకి ఫోన్ చేశాను. బుక్స్టాల్కు ఎదురుగుండా మృదంగం కాస్త నలుగురికీ కనబడేటట్టుగా వుంచి వెయిట్ చెయ్యమన్నారు. ఎవరో ఓ అబ్బాయి వచ్చి నన్ను తీసికెళ్తాడట. కనబడేటట్టుగా ఏం ఖర్మ, వినబడేటట్టుగానే పట్టుకుంటానని చెప్పి ఇలా కూర్చున్నాను” అన్నాడు.
“అంతా బాగానే ఉంది. దుప్పటీ వేపు చూడు..” అన్నాను.
అప్పుడతను పారవశ్యం లోంచి ప్రాపంచికానికి వచ్చి దుప్పటికేసి చూశాడు. పది పావలా నాణాలు, నాలుగు అర్ధ రూపాయలు, ఓ పాతిక వరకూ చిన్న చిన్న నాణాలూ విసిరేసి వున్నాయక్కడ.
“శివశివా” అని లేచాడతను.
“ఆంధ్రా భవన్ నాకు తెలుసు. నా కోసం ఐపీఏ నుంచి కారు వచ్చుంటుంది. లే, నిన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను” అని అతన్ని లేవదీసుకెళ్లాను. “సాయంకాలం మీరు కచేరీకి రావాలి” అన్నాడు. ‘వ్యర్థ వాగ్దానం తప్పు కదా’ అని “రాలేనని” చెప్పేశాను.
“అయ్య బాబోయి, అయితే ఇప్పుడే చెప్పేస్తాను!” అన్నాడు.
నా రచనలంటే ఇష్టం అని బాగా అందరికీ తెలిసి పోయేటట్టు చెబుతూ ఉండే ఒకానొక మరింత సీనియర్ ఐఏఎస్ అధికారి ఢిల్లీలో ఆకాశవాణి డైరెక్టరేట్ జనరల్ ఆఫీసులో పరిపాలనా విభా గానికి డీడీజీగా వున్నా రని, అతనికి నా క్లాస్మేటూ, తన తండ్రీ అయిన సోమనాథం చెప్పేడట. ఆంజనేయులు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో మృదంగం ఆర్టిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసేడట. ఇతనికి ఆ ఉద్యోగం ఇమ్మని హైదరాబాదు స్టేషను డైరెక్టరు గారికి ఆయనతో చెప్పించమని కాళ్లా వేళ్లాపడి అడిగేడు. సరే కదా అని, ఆ రోజు మధ్యాహ్నం రావు గారిని కలిసి ఆడిగాను. “ఆఖరికి మీరు ఇలాంటి రికమెండేషన్లకి కూడా సిద్ధమై పోతున్నారన్నమాట!” అని రావుగారు నా మీద చిరాకు పడ్డారు.
మూడోసారి ఆంజనేయులు నాకు బెజవాడలో తగిలేడు. మా సాహిత్య సంఘం కోసం విజయవాడలో ఓ పుస్తకం అచ్చు వేయించే పనిమీద వెళ్లేనన్నమాట. మా వదిన గారింట్లో మకాం చేసేను. పని పూర్తయిన నాడు సాయంకాలం నేను కోణార్క ఎక్స్ప్రెస్కు ప్రయాణం అవుతున్నాను.
“గ్యాస్ అయిపోయింది. చూసేవు కదా!” అంది మా వదిన.
“నువ్వెళ్ళే దారిలోనే మా గ్యాస్ కంపెనీ ఆఫీసుంది. మా నెంబరు ఇదిగో. అక్కడ కంప్లెంటిచ్చి అలా వెళ్ళిపో” అని మా వదిన తన గ్యాస్ కంప్లెంటుని నాకు అప్పగించింది.
సీతమ్మ వారికి లక్ష్మణుడంతటి వొదినా విధేయుడిని కాకపోయినా, గ్యాస్ కంపెనీ దగ్గిర రిక్షా ఆపించి లోపలికి వెళ్ళేను. అక్కడ -మేనేజరు స్థానంలో ఆంజనేయులు కూర్చుని వున్నాడు!
“ఆ రోజు ఢిల్లీలో కచేరీకి మీరు రాలేదు గాని, పెట్రోలియం మినిష్టరుగా వున్న దత్తాత్రేయ గారు వచ్చేరండి. ఆయన ఆ కార్యక్రమానికి ఛీఫ్ గెస్టన్న మాటండి. ఆయన మా చిన్నమ్మమ్మ గారి అల్లుడండి. కచేరీ అయిపోయాక నన్ను వాళ్ళ బంగళాకి తీసుకెళ్లి ఎవరెవరికో ఫోన్లు చేసి, ఏవేవో కాయితాలు తెప్పించి సంతకాలు చేయించుకున్నారండి. ఎన్ని కచేరీలకి పక్క వాద్యం వాయిస్తే వృద్ధిలో కొస్తావు? పో, బెజవాడలో గ్యాస్ ఔట్లెట్ పెట్టుకో!” అని బ్యాంకులకి చెప్పి డిపాజిట్టు అప్పు ఇప్పించడం నుంచీ అన్నీ ఆయనే చేసేరండి. అలా ఇక్కడ స్థిరపడ్డానండి!” అన్నాడు.
మా వదిన గారి ఇంటెడ్రసు అడిగి, అక్కడ వప్పగించడానికి అప్పటి కప్పుడు ఒక సిలిండరు (రీఫిల్) తెప్పించి బోయ్కి పురమాయించేడు. ఆ బోయ్ ఆ సిలెండర్ను సైకిలుకి కట్టుకుంటూ వుండగా, ఆంజనేయులు (ప్రవృత్తి చాపల్యం చేత) ఆ సిలెండరు మీద తన చేతి వేళ్లతో “తధిగిణతోం, తకధిమి తధిగిణతోం!” అని వాయించి “ఓకే” అన్నాడు.
భమిడిపాటి రామగోపాలం ‘సరదా కథలు’ నుంచి..
‘కథా నిలయం’ సౌజన్యంతో..