సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన
గత వారం రోజుల నుండి విధులకు హాజరుకాని కార్యదర్శి
ఫోన్ చేసిన స్పందించక పోవడంతో రైతుల ఆగ్రహం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల ఆందోళన
తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు సిద్ధమన్న రైతులు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామంలో రైతులు సొసైటీ వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. సొసైటీ పరిధిలో కోసిన ధాన్యానికి కాంటాలు పెట్టడం లేదని, ఇతర గ్రామాలకు వెళ్లి కాంటాలు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యదర్శి గత వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు తెలిపారు.
వాతావరణ హెచ్చరికలు ఉన్న ఈ సమయంలో ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 4న కోసిన వడ్లకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోగా, 18వ తేదీన కోసిన వడ్లకు మాత్రం వెంటనే కాంటాలు పెట్టారని రైతులు ఆరోపించారు.రైతుల మధ్య వివక్ష చూపకుండా వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.






