తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్ర ప్రజలకు తీపికబురు
హైదరాబాద్: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందన్నారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు, ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ(Distribution of ration cards) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.








