28-05-2025 01:32:31 AM
కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 27(విజయక్రాంతి): రీజనల్ రింగ్ రోడ్డు, నిమ్జ్ పూర్తయితే జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రెవిన్యూ, నిమ్జ్ ప్రత్యేక అధికారులతో భూసేకరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్జ్కు 12,500 ఎకరాలకు 7500 ఎకరాలు భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు.
రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే రవాణా సులభతరం అవుతూ విద్య, వాణిజ్య, వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్జ్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ విషయంపై ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డిఓ, తహసిల్దార్లు పాల్గొన్నారు.