03-06-2025 01:07:33 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో తాము అధికారంలోకి వస్తామన్నారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చారని సీఎం అవతరణ దినోత్సవం రోజు కూడా అబద్ధాలు చెప్తున్నారని, జీవో, ఆధారం చూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
సోమవారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే, రేవంత్ అబద్ధాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టిన నాడు జై తెలంగాణ పదాన్ని నిషేధించిన పరిస్థితి ఉందని, నేడు సీఎం రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి కేసీఆరే కారణమన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం తాము రాజీనామాలు చేయాలని నిర్ణయిస్తే, టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డి జిరాక్స్ పేపర్ ఇచ్చారని ఆరోపించారు. నాడు ఆయన ఏనాడూ జైతెలంగాణ అనలేదని, ఒక్క నాడు అమరులకు దండం పెట్టలేదని, ఉద్యమకారులపైకి రైఫిల్తో వెళ్లి రైఫిల్రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్ సహా మేమందరం రాజీనామా చేస్తే, కిషన్రెడ్డి రాజీనామా చేయకుండా వెన్నుచూపిపారిపోయారన్నారు.
60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్న రేవంత్ ఇచ్చింది పదివేలు దాటలేదని విమర్శించారు. సీఎంకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మిల్లా మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తునాయని, వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని, వీడియో బయటపెట్టి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టినందుకు పోలిస్ కమాండ్ కంట్రోల్లో సీఎం సమీక్షలు చేస్తున్నట్లుందని హరీశ్రావు ఆరోపించారు. ఏడాది పాలనలో సీఎంగా రేవంత్రెడ్డి చేసిందేమి లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద రివ్యూ చేయని సీఎం, అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నారని మండిపడ్డారు.
గోదావరి బనకచర్ల మీద బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడటం లేదని, తెలంగాణకు బనకచర్ల ప్రాజెక్టు శాపం కాబోతున్నదని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ఫెయిల్ అయితే ప్రాజెక్టును ఆపేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు.