calender_icon.png 2 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రామాలు వద్దు!

02-12-2025 12:55:17 AM

-పార్లమెంటులో విధానాలపై చర్చ జరగాలి

-విపక్షాలు ఓటమి బాధ నుంచి బయటపడాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : పార్లమెంట్ శీతాకాల సమావేశాల సంద ర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో డ్రామాలు వద్దని, దేశానికి అవసరమైన విషయాలపైనే దృష్టి పెట్టాలని సారించాలని హితవు పలికారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని, పార్లమెంటును మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన సూచించారు. సోమవారం సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధా ని, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

శీతాకాల సమావేశాలు కేవలం ఒక సంప్రదాయం కాదని, దేశాన్ని శరవేగంతో ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని అన్నారు. ‘భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో జీవిస్తోంది. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో భారీగా పోలైన ఓటింగ్, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరిచింది. ప్రజాస్వామ్యం ద్వారా ఫలితాలు సాధించగలమని భారత్ నిరూపించింది. ప్రపంచం మన ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థల బలాన్ని నిశితంగా గమనిస్తోంది‘ అని ఆయన వివరించారు.

విపక్షాల వైఖరిపై మండిపాటు

విపక్షాల వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పుబట్టారు. ‘దేశం కోసం పార్లమెంటు ఏం ఆ లోచిస్తోంది, ఏం చేయాలనుకుంటోంది అనే దానిపై ఈ సమావేశాల్లో దృష్టి సారించాలి. ఇటీవల ఎన్నికల ఓటమి బాధ నుంచి విపక్షాలు బయటకు వచ్చి, తమ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని అంగీకరించలేకపోతున్నాయి’ అని మోదీ విమర్శించా రు.

బీహార్ ఎన్నికలు ముగిసి రోజులు గడిచినా, వారి మాటలు వింటుంటే ఓటమి బాధ ఇంకా వదిలినట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు. సభలో కొత్తగా ఎన్నికైన, యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి ఎన్నికైన వారు, యువతరం ఎంపీలు సభలో మాట్లాడలేకపోతున్నారు. తమ ప్రాంత సమస్యలను వినిపించలేకపోతున్నారు. దేశాభివృద్ధికి అనుకూలంగా మాట్లాడినా వారిని అడ్డుకుంటున్నారు.

వారికి అవకాశం కల్పించడం మనందరి బాధ్యత‘ అని ఆయన అన్నారు. ‘డ్రామాలు చేయడానికి చాలా చోట్లున్నాయి, ఎవరైనా అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరగాల్సింది డెలివరీ.. డ్రామా కాదు. నినాదాలు చేయడానికి దేశం మొత్తం ఉంది. ఎక్కడ ఓడిపోయారో అక్కడ నినాదాలు చేశారు, రేపు ఎక్కడ ఓడిపోతారో అక్కడ కూడా చేయొచ్చు.

కానీ పార్లమెంటులో మాత్రం విధానాలపైనే దృష్టి పెట్టాలి’ అని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నెగిటివిటీ పనికొస్తుందేమో గానీ, దేశ నిర్మాణానికి సానుకూల దృక్పథమే అవసరమని ఆయన హితవు పలికారు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజా వ్యతిరేకత కారణంగా సొంత రాష్ట్రాల్లో పర్యటించలేని స్థితిలో ఉన్నాయని, అలాంటి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

డ్రామా అంటే ఎలా?

-ప్రజా సమస్యలపై చర్చ లేనప్పుడు పార్లమెంట్ దేనికి?

-చర్చ వద్దనడమే డ్రామా: ఎంపీ ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : పార్లమెం టులో డ్రామాలొద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రత్యేక సమగ్ర చట్ట సవరణ (ఎస్‌ఐఆర్), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్ర శ్నించారు.

ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ‘సర్’, కాలుష్వం వంటివి త్రీవమైన అంశాలపై పార్లమెంటులో చర్చిద్దామని, వీటిపై చర్చ లేనప్పుడు ఇక పార్లమెంట్ దేనికని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలను లేవనెత్తడం డ్రామా అని అనడం సరికాదని ఆమె అన్నారు. చర్చ వద్దనడమే డ్రామా అవుతుందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.