11 June, 2026 | 1:41 AM

జిల్లా వ్యాప్తంగా 119 జీపీలు, 9 వార్డుల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ తీర్మానాలు

11-06-2026 12:48 AM

మహబూబాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 119 గ్రామపంచాయతీలు, 9 మున్సిపల్ వార్డుల్లో సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కలిసి‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ట్రాఫిక్ నియమాలను విధిగా పాటిస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దుకుంటామని, గంజాయి అనే మహమ్మారిని తమ గ్రామాల్లోకి రానివ్వబోమని ఏకగ్రీవంగా తీర్మానించడం సంతోషకరమని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పేర్కొన్నారు.

‘సురక్షిత - గంజాయి రహిత ఆదర్శ గ్రామం’గా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని, హెల్మెట్ తప్పనిసరి, గంజాయి సమాచారానికి రూ.5,000 నగదు బహుమతి ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. గూడూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, రహదారి భద్రతపై గ్రామ సర్పంచ్ సునీత అధ్యక్షతన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు రహదారి భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవిస్తోందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

గ్రామ పంచాయతీలు అమలు చేస్తున్న ‘నో హెల్మెట్  నో ఎంట్రీ’ నిర్ణయం అభినందనీయమని, ఈ నిర్ణయం తీసుకున్న గ్రామాల సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ గ్రామసభలో రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, గూడూరు సి.ఐ వినయ్ కుమార్, ఎస్.ఐ గిరిధర్ రెడ్డి, ఎం.ఆర్.ఓ నాగభవాని, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో అబ్దుల్ మాలిక్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.