ఇక ఏటీఎం చార్జీల బాదుడు
- పరిశ్రమ ప్రతిపాదన
- ఆర్బీఐ అనుమతించే అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 13: ఇక ఏటీఎం చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతున్నది. బ్యాంక్ అందించే ఉచిత లావాదేవీలకు మించి వాడే ప్రతీ ఏటీఎం లావాదేవీపై పన్నులతో సహా ఇప్పటికే రూ.26 పైగా గుంజుతున్నారు. మన ఖాతాలో రూ.100 బ్యాలెన్స్ ఉంటే దానిపై రూ.26 వడ్డీ రావాలంటే ఎన్నో ఏండ్లు ఆ బ్యాలెన్స్ను ఉంచాలి. అదే ఏటీఎంలో రూ.100 విత్డ్రా చేసినా, ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా వసూలు చేసే చార్జీ తడిసిమోపెడు. తాజా ఏటీఎంలు నిర్వహించే సంస్థల అసోసియేషన్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) తమ ఇంటర్ఛేంజ్ ఫీజు పెంచాలంటూ రిజర్వ్బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లను కోరింది.
ప్రస్తుతం ఈ ఇంటర్ఛేంజ్ ఫీజు లావాదేవీకి గరిష్ఠంగా రూ.21 ఉండగా, దానిని రూ.23కు పెంచా లని సీఏటీఎంఐ ప్రతిపాదించింది. సాధారణంగా ఏటీఎం కార్డుతో నగదును విత్డ్రాచేస్తే ఆ ఏటీఎం కార్డును జారీచేసిన బ్యాంకే ఖాతాదారుకు అనుమతించిన ఉచిత లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును చెల్లిస్తుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ఆ ఫీజును ఖాతాదారు నుంచి వసూలు చేసి ఏటీఎం నిర్వహణా సంస్థకు చెల్లిస్తుంది. ఈ ఇంటర్ఛేంజ్ ఫీజుకు సర్వీసు ట్యాక్స్తో కలిపి రూ.26 మేర అవుతుంది.
పెంపునకు అనుమతి తప్పదు
ఇంటర్ఛేంజ్ ఫీజును రెండేండ్ల క్రితం పెంచినట్టు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ తెలిపారు. తదుపరి పెంపు కోరుతూ తాము రిజర్వ్బ్యాంక్ను సంప్రదించామని, వారు (ఆర్బీఐ అధికారులు) తమ ప్రతిపాద నకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. గత పెంపునకు ఎన్నో ఏండ్ల సమయం పట్టిందని, ఈ నేపథ్యంలో తాజా పెంపునకు అనుమతి తప్పక వస్తుందన్న ఆశాభావాన్ని జాన్సన్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు బ్యాంక్లు వాటి సొంత ఏటీఎంల్లో హైదరాబాద్తో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నెలకు ఐదు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్నాయి. అదే కార్డు జారీచేసిన బ్యాంక్..ఇతర బ్యాంక్ల ఏటీఎంల్లో మూడు ఉచిత లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయి.






