30-07-2025 12:56:42 AM
ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు రావొద్దు
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ, ముంబై, చెన్ను వంటి నగ రాల్లో ప్రజలు విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకూడ దని సీఎం పేర్కొన్నారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని సీఎం ఆదేశించారు.
పుర పాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని, ఇందుకు రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకుగాను ఢిల్లీ, ముంబై, చెన్ను వంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబులింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్లు తయారు చేయాలన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, నిర్మాణరంగ వ్యర్థాలను సిటీలో ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో మంచినీటి సరఫరా, మురు గు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందే లా హైదరాబాద్ మంచినీటి సరఫరా సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు.
బోర్డు తమకున్న వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొంచుకోవాలని సీఎం సూచించారు. ఓఆర్ఆర్ పరి ధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగానూ కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దానిని మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. మార్గదర్శకాల రూపకల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మెట్రోను పట్టాలెక్కించండి
పాతబస్తీలో మెట్రో పనుల పరిస్థితిపైనా సీఎం ఆరా తీశారు. అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున అక్కడ మెట్రో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్ల అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
మీరాలం ట్యాంక్ వద్ద హోటల్
నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతిపైనా సీఎం సమీక్షించారు. మీరాలం ట్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని, పార్క్, మీరాలం ట్యాంక్తోపాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, రాష్ర్ట పురపాలక, పట్టణాభివృద్ది (హెఎండీఏ ఏరియా) కార్యదర్శులు ఇలంబర్తి, టి.కె.శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సీడీఏ కమిషనర్ కే.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
మూసీపై బ్రిడ్జి కం బ్యారేజీ
మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్ను నిర్మించాలని సీఎం సూచించారు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని అధికారులకు తెలిపారు.