31-07-2024 01:30:50 AM
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): పదే పదే తన తల్లిదండ్రులకు పోడు భూముల పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, తమకు పోడు భూములెవరూ దానంగా ఇవ్వలేదని, వాటిని హక్కుగానే సాధించుకున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్కుమార్ లేవనెత్తిన ప్రశ్న కు ఆమె ఘాటుగా స్పందించారు.
తమ కుటుంబం అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబమని, ఇప్పటికీ తన తండ్రి అడవికి వెళ్లి పనిచేసుకుంటాడని గుర్తుచేశారు. చట్ట ప్రకారమే తన తల్లిదండ్రులకు పోడు భూములపై హక్కు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పోడు భూముల చట్టంతోనే ఎస్టీలకు లబ్ధి చేకూరిందని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో ఎంత మంది గిరిజనులకు ఉద్యోగాలు, ఇండ్లు ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్తోనే మహిళల అభ్యున్నతి..
కాంగ్రెస్ హయాంలోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని, వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చి కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు.