20-06-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి రైతు బంధువుని అందజేసి, వారికి అండగా నిలవగా, సీఎం రేవంత్ రెడ్డి అలాంటి మహోన్నత పథకాన్ని ఎన్నికల కోసం వాడుకోవడం సిగ్గుచేటని మా జీ మంత్రిజోగు రామన్న ధ్వజమెత్తారు. రైతుకు అన్యాయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, జోగు రామన్న ప్రజలకు పిలుపునిచ్చారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు జమ చేస్తోందని, రైతు భరోసా ఎన్నికల భరోసా గా మారిందని ఎద్దేవా చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు సైతం ఇదే రీతిన రైతు భరోసా డబ్బులు వేసి... యాసంగి పంటల సీజన్ లో నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
రైతు బీమా సైతం అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మన్ యోజనలోనూ రైతుల సంఖ్యను భారీగా తగ్గించిందని మండిపడ్డారు. క్రాప్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారని, ప్రీమియం డబ్బులు కట్టుకునేందుకు సైతం అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రానున్న ప్రతి ఎన్నికల్లో రైతులకు అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుల పక్షాన వారికి న్యాయం జరిగేంత వర కు బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లు యాసం నర్సింగ్ రావు , మెట్టు ప్రహ్లాద్, మెస్రం పరమేశ్వర్, అశోక్ స్వామి, శ్రీనివాస్, పరమేశ్వర్, కుమ్రా రాజు, దయానంద్, తిరుపతి, జంగిల్ ప్రశాంత్, నరేష్ పాల్గొన్నారు.