27-09-2025 11:04:07 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 2025–27 సంవత్సరం మద్యం పాలసీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 24, పటాన్చెరు 35, జహీరాబాద్ 16, నారాయణఖేడ్ 13, అందోల్ 13, మొత్తం 101 మద్యం దుకాణాలలో రెండు ఎస్టీ, 13 ఎస్సీ, 9 గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించబడిందని ఆయన వివరించారు.
ఈ కేటాయింపులను జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్-26 నుంచి అక్టోబర్-18 వరకు జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం లేదా నాంపల్లిలోని కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో పని దినములలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ దరఖాస్తులకు అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపల్లి లోని జేఎన్ఆర్ గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా కార్యక్రమం నిర్వహించబడనుంది.
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయదలచిన దరఖాస్తుదారులు రూ.3 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ను DISTRICT PROHIBITION & EXCISE OFFICER, SANGAREDDY పేరుమీద సమర్పించాల్సి ఉంటుంది. మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, పాన్ కార్డు ప్రతులు తప్పనిసరిగా జతచేయాలి. రిజర్వేషన్ కేటగిరీకి దరఖాస్తు చేసే వారు ప్రభుత్వంచే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. నవీన్ చంద్ర తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా అధికారి 8712658904, జిల్లా సహాయ అధికారి 8712658907, సంగారెడ్డి సీఐ 8712658912, పటన్చెరు, సీఐ 8712658913, జహీరాబాద్ సీఐ 8712658914, నారాయణఖేడ్ సీఐ 8712658915, అందోల్ సీఐ 8712658916, ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.