05-12-2025 09:08:52 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో మళ్లీ కబ్జాల పర్వం మొదలైంది. తాజాగా భగత్ నగర్లోని 920/4 సర్వే నెంబర్ లోగల వివాదాస్పద స్థలంలో రాత్రికి రాత్రే ఒక మాజీ కార్పొరేటర్ అనుచరులు షెడ్డు వేశారు. గతంలో ఈ సర్వే నెంబర్లో తన భూమిని కబ్జా చేశారంటూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయి కొత్త రాజిరెడ్డి పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం, కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇదే స్థలం తనదేనంటూ చీటి రామారావు సైతం కోర్టును ఆశ్రయించగా ఈ కేసులో అప్పట్లో చీటి రామారావు అరెస్టయ్యారు.
తదనంతరం కొత్త రాజిరెడ్డి మున్సిపల్ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఈ స్థలంలో ఉన్న మరో 150 గజాల ఖాళీ జాగను ప్రస్తుతం ఆక్రమించే ప్రయత్నం జరుగుతుంది. గతంలోనే కోర్టు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశించింది. అయితే రాత్రికి రాత్రే ఇక్కడ షెడ్డు వెలిసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పలువురు కార్పొరేటర్లతోపాటు నాయకులు కబ్జాలకు పాల్పడ్డ నేరారోపణలపై అరెస్టులకు గురయ్యారు. ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కు అప్పట్లో వందలకొద్ది ఫిర్యాదులు అందాయి. చాలామంది అరెస్టయి జైలు ఊసలు లెక్కపెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అప్పట్లో అభిషేక్ మహంతి కబ్జాదారులపై కొరడా ఝుళిపించడంతో భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. అభిషేక్ మహంతి బదిలీ అయిన అనంతరం ఈ వింగ్ కార్యకలాపాలు ఆగిపోవడంతో మళ్లీ కబ్జాల పర్వం మొదలయింది. ఒకే స్థలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడం వంటి సంఘటనల ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండడంతో మళ్లీ కథ మొదటికి వచ్చినట్లయింది.
లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్వే నెం. 954లో రామకృష్ణ అనే వ్యక్తి 133 గజాల స్థలాన్ని కొనుగోలు చేయగా, అదే స్థలాన్ని మరొకరు కృష్ణ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. రామకృష్ణ ఇటీవల స్థలానికి ప్రహారీగోడ నిర్మించగా దానిని కృష్ణ వర్గీయులు కూలగొట్టడంతో రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అయితే సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవడంలో పోలీసులు వెనకాముందు అవుతుండడంతో కబ్జాదారులు విజృంభిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్లను నిలిపివేసి ఉన్న కొన్ని నెంబర్లపై కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండడం విశేషం.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంటు రైటర్లు, అధికారుల మధ్య ఒప్పందంతో ఈ దందా కొనసాగుతుంది. ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కొత్తపల్లి, రేకుర్తి భూముల విషయంలో హెచ్చరికలు జారీ చేసినా కొన్ని రోజులపాటు నిలిచిపోయిన అక్రమ రిజిస్ట్రేషన్లు మళ్లీ కొనసాగుతున్నాయి. గాయత్రీనగర్ లాంటి చోట ఇంటి నెంబర్లు ఉన్న ఇళ్ల అమ్మకాలు, కొనుగోలుకు మాత్రం మున్సిపల్ అధికారులు ఎన్వోసీ ఇచ్చినా రిజిస్ట్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి చక్కబడాలంటే రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.