25-04-2025 01:47:56 AM
సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం, ఏప్రిల్ 24( విజయక్రాంతి ):-ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, దాంతోపాటు సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఈమెరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇప్పించి, వారిని ఒప్పించి అధికారిక అనుమతులు సాధించారని ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తం ను అభినందించారు. మంత్రి ఉత్తం ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది అని డిప్యూటీ సీఎం తెలిపారు. దశాబ్దాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మూలంగా అధికారిక అనుమతులు సాధించడం అభినందనీయం అన్నారు.