02-12-2025 01:09:11 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, డిసెంబరు 1 (విజయ క్రాంతి): ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నుస్తులాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను, కొత్తపల్లి గ్రామపంచా యతీలో కొత్తపల్లి, రేణిగుంట పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు.
నామినేషన్ పత్రాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.
అభ్యర్థుల అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు హెల్ప్ డెస్క్ లో అవగాహన కల్పించాలని, సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. ప్రతి చిన్న అంశాన్ని అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.