ఇద్దరమ్మాయిలతో..

10-05-2024 12:05:00 AM

వెండితెరపై కథానాయకుల తరువాత స్థానం కథానాయికలదే.. సినిమాలో అందమైన కథానాయిక వుందంటే చాలు.. అందరూ ఆమె ఎంట్రీ కోసం ఎదురుచూస్తారు. ఒక సినిమాలో ఒక కథానాయిక కామనే. అయితే ఒకే సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంటే. ఆ సినిమా మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే ఈతరం  సినిమాలో కథానాయిక అంటే కేవలం గ్లామర్ కోసమే కాదు... కథలో ఆమె పాత్ర కూడా కీలకంగా వుంటుంది.  ఇప్పటికే ఇద్దరు భామలతో వచ్చిన సినిమాలు ఎన్నో ఆడియన్స్ ఆకట్టుకున్నాయి. అయితే త్వరలోనే రానున్న కొన్ని సినిమాల్లో ఇప్పుడు మరలా ఇద్దరు నాయికలు సందడి చేయనున్నారు. 

ప్రభాస్‌తో దీపికా, దిశా

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ ఫిలిం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇద్దరు బాలీవుడ్ భామలు సందడి చేయనున్నారు. దీపికా పదుకునె, దిశా పటానీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో ముగించే కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అగ్రనటులు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్‌లు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

పుష్ప రష్మిక మందన్నా, సాయిపల్లవి? 

విజయవంతమైన చిత్రం ‘పుష్ప’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప ది రూల్. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో మొదటిభాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక మందన్నాతో పాటు సాయిపల్లవి కూడా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఆ వార్తలను ధృవీకరించలేదు. దేవి శ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

భారతీయుడు ముగ్గురు భామలు 

కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రాబోతున్న సీక్వెల్ ‘భారతీయుడు ఈ ఇద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తారు. 

స్వయంభూలో ఇద్దరు!

‘కార్తీకేయ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఈ చిత్రంలో నిఖిల్ యుద్ధ యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభానటేశ్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం సంయుక్త ఇటీవల గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. 

రాజాసాబ్‌తో ముగ్గురు 

కల్కితో పాటు ప్రభాస్ మరో  ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ‘రాజా సాబ్’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక, రిద్ధి కథానాయికలుగా నటిస్తున్నారని తెలసింది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో వుంది. 

వరుణ్‌తో మీనాక్షి, నోరా 

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. విశాఖపట్నం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి తోపాటు బాలీవుడ్ నాయిక నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో వుంది.