ఉన్నత చదువులను అభ్యసించాలి
ములకలపల్లి, మే 4 (విజయక్రాంతి): క్రమశిక్షణ,అంకితభావంతో చదువును అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్,పాతగంగారం సర్పంచ్ సోడే చైతన్య విద్యార్థులకు సూచించారు.పాతగంగారం గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరం పదవతరగతి చదివి పాసైన విద్యార్థినీ, విద్యార్థులకు కొత్త గంగారం గ్రామంలో సోమవారం సర్పంచ్ సోడే చైతన్య ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవతరగతి పాసైన విద్యార్థులందరూ తగిన క్రమశిక్షణతో ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాసై ఉన్నత చదువులు చదవాలని కోరారు.ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని సూచించారు.పాతగంగారం పంచాయతీ పరిధిలో చాలామంది మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సర్పంచ్ సోడే చైతన్య మాట్లాడుతూ సర్పంచ్ ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారంగానే విద్యార్థులను చదువులలో ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు.10 మంది బాలికలు, 5గురు బాలురకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీదేవి, వార్డుసభ్యులు,గ్రామ పెద్దలు సోడే వెంకటేశ్వరావు,మడకం సురేష్, ఇరపా ప్రసాద్,మడకం రమేష్, ఇరపా ప్రవీందర్,కల్లూరి ప్రసాద్,వర్సప్రసాదు, వర్ష శ్రీ, రాములు పాల్గొని విద్యార్థులను శాలువాలతో సన్మానించారు.






