16-10-2025 08:54:44 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): ఆన్లైన్లో మెటా ఫండ్ అనే నకిలీ కాయిన్ యాప్ను సృష్టించి, అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుండి సుమారు రూ. 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు పెట్టుబడులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు మల్కాజ్గిరి, హైదరాబాద్ నివాసి ను కరీంనగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నైపుణ్యం కలిగిన లోకేశ్వర్రావు, కరీంనగర్కు చెందిన తులసి ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్ లతో కలిసి ఈ మోసానికి ప్రణాళిక రచించారు.
మోసం వివరాలు:
లోకేశ్వర్రావు నకిలీ మెటా ఫండ్ ఆన్లైన్ యాప్ను, కాయిన్లను సృష్టించారు.
రూ. 90,000 పెట్టుబడికి 1,000 కాయిన్లు ఇస్తామని, నెల రోజుల్లో మూడు రెట్లు లాభంతో అమ్ముకోవచ్చని ప్రజలను నమ్మించారు.
బాధితులను నమ్మించడానికి రిసార్ట్లు, గోవా, విదేశీ ట్రిప్లకు తీసుకెళ్లి ప్రలోభాలకు గురిచేశారు.
బాధితుల నుండి డబ్బును నగదు రూపంలో తీసుకుని, కేవలం ఆన్లైన్లో నకిలీ ఐడీలు, కాయిన్లను కేటాయించారు. డబ్బు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను రూపొందించారు.
చివరికి యాప్ను ఆన్లైన్ నుండి తొలగించి ప్రజలను మోసం చేశారు.
దర్యాప్తు, అరెస్ట్లు:
కరీంనగర్ రూరల్ మరియు కరీంనగర్-II టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో తులసి ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్లను గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వరాలు: లోకేశ్వర్రావును బుధవారం ఎల్.యం.డి. అలుగునూరు వద్ద అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుండి బాధితుల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు, 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, అలాగే ప్రధాన నిందితుడి వద్ద నుండి ఒక బి.ఎం.డబ్ల్యూ. కారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించిన పోలీస్ సిబ్బందిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ఆన్లైన్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని ఎవరైనా చెబితే జాగ్రత్త వహించాలని, తప్పుదోవ పట్టించే యాప్లు లేదా అనుమానాస్పద పెట్టుబడి పథకాలలో డబ్బు పెట్టి మోసపోవద్దని కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ జిల్లా పోలీస్ తెలియజేశారు.