21-05-2025 12:57:27 AM
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయం, ‘ఆపరేషన్ సిందూర్’తో దేశమంతటా వీస్తున్న జాతీయవాద పవనాలు రానున్న బీహార్ ఎన్నికలపై బలమైన ముద్ర వేయనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సివుంది. 202౩లో బీహార్లో జరిపిన కులగణన ప్రకారం, ఆ రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఈబీసీలు కలిపి 63శాతం అని తేలింది.
ముస్లింలను బీసీ జాబితాలో చేర్చకుండా కులగణన చేపడతామన్న కేంద్రం ప్రకటన బీహార్లో సమీకరణలన్నింటినీ మార్చేదిగా వుంది. రాష్ట్రంలో ముస్లిం జనాభా దాదాపు 18శాతంగా ఉంది. నిజానికి బీహార్లో గెలుపోటములను నిర్ణయిస్తూ వస్తున్నది ఈబీసీలే. 36శాతంగా వున్న ఈబీసీలను తమ వైపు తిప్పుకోకుండా ఎన్నికల్లో గెలువలేమని ప్రతి పార్టీకి తెలుసు.
ఓబీసీల కంటే సామాజికంగా, విద్యపరంగా, ఉద్యోగాలపరంగా బాగా వెనుకబడిన ఈబీసీలకు సరైనా న్యాయం చేయాలని 50 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ వారిని ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించారు. ఐదారు నెల్లల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా మొన్నటివరకు ముఖ్యమంత్రి, జేడీ (యూ) నాయకుడు నితీశ్ కుమార్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు కనిపించాయి.
ఆర్జేడీ నాయకుడు తేజస్వియాదవ్తోపాటు సొంతంగా జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసి, అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ రానున్న ఎన్నికల్లో నితీశ్కు గట్టి పోటీ ఇవ్వనున్నారని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. దీన్నిబట్టి బీహార్లో నితీశ్కు ఈసారి గెలుపు నల్లేరు మీద నడక కాదని తేలిపోయింది. కానీ మారిన పరిస్థితులు ఇప్పుడు బీహార్లో ఏ పార్టీకి అనుకూలం కానున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో మాహాకూటమికి ‘రాం.. రాం’ అని ఎన్డీఏలో చేరిన నితీశ్ పార్టీ సాధించింది 48 సీట్లే. 138 సీట్లు సాధించి గత ఎన్నికల్లో ఏన్డీఏ 138 సీట్లతో (బీజేపీ-84) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాహాకుటమికి 104 సీట్లు దక్కాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత బీహార్ ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు. దేవాలయాల్లో పూజలు చేశారు. సైనిక కుటుంబాల్లో అనందోత్సాహాలు కని-పించాయి.
ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ఎందుకు అంగీకరించారు? గతంలో ఇందిరా గాంధీ చూపిన ధైర్యాన్ని మోదీ ఎందుకు ప్రదర్శించలేకపోయారని బీహార్లో కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్నలు ఇప్పుటికైనా పెద్దగా ప్రజల చెవిన పడుతున్నట్లు కనిపించడం లేదు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, కులగణన, ఆపరేషన్ సిందూర్తో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తథ్యమని బీజేపీ భావిస్తున్నది.
ఆపరేషన్ సిందూర్తో మోదీ ప్రజాదరణ పెరిగిందని, బీహార్ ఎన్నికల సభల్లో మోదీ ప్రచారం తమకు లభిస్తుందని కూడా ఈ ఆపార్టీ భరోసాతో వుంది. మరోవైపు తేజశ్వియాదవ్ నాయకత్వంపై గంపెడాశలతో వున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎంఎల్ (లిబరేషన్) సీట్ల సర్దుబాటు సజావుగా చేసుకొని ఎన్డీఏ ఎదుర్కోవాలని నియోజకవర్గాల వారీగా వ్యూహరచనలో వున్నాయి.