calender_icon.png 13 June, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దార్శనికుడు రాజీవ్‌గాంధీ

21-05-2025 12:54:53 AM

(నేడు రాజీవ్‌గాంధీ వర్ధంతి)

విద్య ద్వారా ప్రజలు ప్రజాస్వామిక విలువలు తెలుసుకుంటారని, విద్యతోనే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని నమ్మిన ప్రధాని రాజీవ్‌గాంధీ. ప్రతి పౌరుడికి రాజకీయ అవగాహన ఉండాలని ఆయన కోరుకునేవారు. ఎస్సీ, ఎస్టీలకు విద్యను అత్యంత చేరువ చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. కుల జాఢ్యం ఉండకూడదని, ప్రజలు విద్యావంతులయ్యే కొద్దీ ఆ జాఢ్యం కనమరుగవుతుందని ఆయన నమ్మేవారు.

‘పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, స్వావలంబన స్థాపన’ అనే నినాదంతో ఆయన 7వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టడం అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని 1986లో జరిగిన ఓ జాతీయస్థాయి అధికారిక సమావేశంలో ప్రకటించారు. అప్పటివరకు వారి జీవితాలను మార్చేందుకు దృఢసంకల్పంతో యంత్రాంగం పనిచేయడం లేదని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.

మహిళా సాధికారతపై కూడా ఆయనకు స్పష్టమైన ఉద్దేశాలు ఉండేవి. ‘ఒక దేశంలో మహిళలు ఏ స్థితిలో ఉన్నారో.. చూసి ఆ దేశ పురోగతిని అంచనా వేయవచ్చు’ అని రాజీవ్‌గాంధీ అభిప్రాయపడేవారు. ఇదే విషయాన్ని అనేక సభల్లో ఆయన ఉటకించారు. దేశ నిర్మాణంలో మహిళలదే ప్రధాన పాత్ర అని కొనియాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని, అలా అయితేనే.. ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని నమ్మేవారు. రాజీవ్‌గాంధీ గుర్తించదగిన రాజకీయ సంస్కరణల్లో పార్టీ ఫిరాయింపులను ఉపేక్షించకుండా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టాన్ని 10వ షెడ్యూల్‌లోకి చేర్చారు.

భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ సమగ్రతను నిలబెట్టేందుకు రాజీవ్‌గాంధీ ఎంతగానో కృషి చేశారు. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు ఆదర్శాలను కూడా రాజీవ్‌గాంధీ అనుసరించేవారు. దేశానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో ఆయన ముఖ్యభూమిక పోషించారు. దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారు. డిజిటల్ పరివర్తన  సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసింది ఆయనే.

21 మే 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనగా,  అక్కడ ఆత్మాహుతి బాంబు పేలింది. ఆ పేలుడులో రాజీవ్‌గాంధీ మృతిచెందారు. ఆయన మరికొన్ని సంవత్సరాలు బతికి ఉంటే దేశం మరింత పురోభివృద్ధి సాధించేదని ఇప్పటికీ దేశప్రజలు అంటున్నారంటే.. ఆయన సేవలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

 డాక్టర్ ముచ్చుకోట సురేశ్‌బాబు, 

కాంగ్రెస్ సేవాదళ్ ఏపీ,

తెలంగాణ సోషల్‌మీడియా కన్వీనర్