24-06-2025 11:22:05 PM
తెలంగాణ వాసి రాకేష్ ఆర్నెకి మిస్టర్ ఇండియా 2025 టైటిల్ సొంతం..
నవాబ్ పేట: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె(Rakesh Arne) మిస్టర్ ఇండియా(Mr. India 2025)టైటిల్ను సాధించి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన రాకేష్ అర్నే గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ను కైవసం చేసుకున్నారు. తాజాగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాథను, భవిష్యత్ ఆకాంక్షలను పంచుకున్నారు. త్వరలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా రాకేష్ ఆర్నె మాట్లాడుతూ... మిస్టర్ ఇండియా 2025 టైటిల్ నా కఠోర శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు ఫలితమన్నారు. ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఈ పోటీలకు సన్నదమయ్యానని, నా తదుపరి లక్ష్యం ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ 2025 పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించడమన్నారు. ఆయన సామాజిక సేవ, టాలెంట్ ప్రదర్శన, అంతర్జాతీయ అవగాహనతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన "సోషల్ ప్రాజెక్ట్ – ఆత్మవిశ్వాసం" అనేక మందిపై ప్రభావం చూపింది.
గ్రామం నుంచి జాతీయస్థాయికి..
గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయికి..
1995 ఆగస్టు 25న జన్మించిన రాకేష్, సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి యాదయ్య సామాజిక సేవకుడిగా, తాత వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు స్ఫూర్తినిచ్చారు. హైదరాబాద్లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసిన రాకేష్, 9 సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నిష్ణాతుడైన ఆయన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నారు.