25 May, 2026 | 1:07 AM

దురదపాడు, ముకుందాపురంలో పామ్ ఆయిల్ తోటలు దగ్ధం

25-05-2026 12:00 AM

దమ్మపేట, మే 24, (విజయక్రాంతి): మండల పరిధిలోని దురదపాడు, గుండుగులపల్లి, ముకుందాపురం గ్రామాల్లోని పామ్ ఆయిల్ తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి.  ఈ పామ్ ఆయిల్ తోటలు లేత తోటలు కావడంతో అంతర పంటగా మొక్కజొన్న  వేశారు. మొక్క జొన్న పంట అనంతరం ఎండిపోయిన చొప్పను భూమిలో కలియ దున్నాలి, కానీ దున్నడానికి అనువుగా లేకపోవడంతో వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.  గత రెండురోజుల నుండి హిట్ వేవ్ కారణంగా ఎండలు 44 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండడంతో ఎదైనా కరెంటు తీగల రాపిడి వల్ల మంటలు అంటుకున్నాయా, లేదా ఎవరైనా కావాలని చేసారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

దురదపాడు గ్రామానికి చెందిన రైతు కాసాని నాగప్రసాద్ 8 ఎకరాల పామ్ ఆయిల్ తోటలో రెండు సంవత్సరాల వయస్సుగల సుమారు 300 మొక్కలు పూర్తీగా కాలిపోయాయనీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ముకుందాపురం గ్రామానికి చెందిన పూచి రమేష్, ఊకె నాగేశ్వరరావు లకు చెందిన పామ్ ఆయిల్ తోటల్లో 40 పామ్ మొక్కలు కాలిపోయాయని, ఈ తోటలకు మంటలు అంటుకోగానే గ్రామస్తులు మంటలను ఆర్పివేశారని లేదంటే సుమారు 10 ఎకరాల తోటలకు మంటలు వ్యాపించేవని తెలిపారు.