calender_icon.png 15 June, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో పార్థి గ్యాంగ్ అరెస్టు

14-06-2025 12:33:37 AM

- జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో నలుగురు మహిళలు 

- గంధపు చెక్కల చోరీకి హైదరాబాద్‌పై కన్ను

- నగరంలో తిష్ట వేసిన 23 మంది ముఠా సభ్యులు

- 10 గంధపు చెక్కలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్ కేంద్రంగా పనిచేసే పార్థి గ్యాంగ్ హైదరాబాద్‌పై కన్నేసింది. గంధపు చెక్కల చోరీకి నగరానికి వచ్చిన ఈ ముఠాకు చెందిన 23 మందిలో నలుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిఘా ఏజెన్సీలను తప్పుదోవ పట్టించేలా మహిళలు, పిల్లలతో కలిసి నగరంలో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్, మరిన్ని నేరాలకు పాల్పడటానికి వచ్చిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్‌లకు చెందిన 23 మంది సభ్యులు దాదాపు 20 రోజుల కిందట హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ముఠాలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. తమపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా పిల్లలు, మహిళలను వెంటబెట్టుకుని సంచరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నగరానికి చేరుకున్న ఈ గ్యాంగ్ జూబ్లీహిల్స్, యూసుఫూగూడలోని ఎన్‌ఐ-ఎమ్‌ఎస్‌ఎంఏ క్యాంపస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించింది.

రాత్రి సమయాల్లో గంధపు చెట్లను నరికి చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఆటోలలో తరలిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నలుగురు మహిళలు పళని బాయి, షానాజ్ బాయి, నిమత్ బాయి, మాధురి ఆదివాసీలను అరెస్టు చేశారు. 10 గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంధపు చెక్కల విలువను అంచనా వేసేందుకు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మరో 19 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ గంధపు చెక్కలను వీరి నుంచి ఎవరు కొనుగోలు చేస్తున్నారు, వీరి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.