విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు.. బీసీ గురుకులాలు
ఆదిలాబాద్, మే 4 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలె బీసీ సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కోసం తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం, అదే విధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులం జిల్లా కోఆర్డినేటర్ కీర్తి రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లా ఇంటర్ ఫలితాలు...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలల్లో గురుకుల విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలు సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలుర ఉత్తీర్ణతా శాతం 91 ఉండగా బాలికల ఉత్తీర్ణతా శాతం 96 గా నమోదైనట్టు జిల్లా కోఆర్డినేటర్ తెలియచేసారు.
దరఖాస్తు వివరాలు...
ఏప్రిల్ 22వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానం ద్వారా https:mjptbcwreis.telangana.gov.in వ్బుసైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ. 200 ఆన్లైన్ లో చెల్లించాలి. పదవ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా పాఠశాలల్లోని ప్రిన్సిపాల్ లకు వారి దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. మళ్ళీ ఆన్లైన్ లో దరఖాస్తు చెయ్యాల్సిన అవసరం లేదు. బీసీ గురుకుల విద్యార్థులకు 50 శాతం, ఇతర పాఠశాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించబడతాయి.
కోర్సుల వివరాలు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా 4 కళాశాలలు మంజూరు అయ్యాయి. కొత్తగా మంజూరైన సీట్లతో కలుపుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం వివిధ కోర్సులలో 2,320 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని కళాశాలలు...
జిల్లా బాలుర బాలికల
ఆదిలాబాద్ 3 3
నిర్మల్ 4 3
మంచిర్యాల 4 4
ఆసిఫాబాద్ 2 3
ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ కళాశాలలు...
మంచిర్యాల - పురుషుల
నిర్మల్ - పురుషుల
ఆదిలాబాద్ - మహిళల
ఆసిఫాబాద్ - మహిళల
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డిగ్రీ కళాశాలలు ఆదిలాబాద్ లోనే నిర్వహించబడుతు న్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో లేదా సమీపంలోని మీ సేవ సెంటర్ ద్వారా ఆన్లైన్ లో https:mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లోని వివరాల కోసం క్రింది నంబర్లలో సంప్రదించగలరు. మంచిర్యాల - 9603705803, నిర్మల్ - 9505520097, ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ - 8897602060.ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కీర్తి రావు తెలియజేశారు.






