టెన్త్ మెమోలపై ‘పెన్’ నంబర్
l ఆధార్ కార్డు తరహాలో సర్టిఫికెట్పై యూనిక్ నంబర్
l ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : పదో తరగతి మార్కుల మెమోలపై పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్)ను ముద్రించనున్నారు. దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల మెమోలపై సైతం పెన్ నంబర్ను ముద్రించి ఇవ్వనున్నారు. ఆధార్ కార్డు తరహాలో 11 అంకెలతో ప్రత్యేక యూనిక్ నంబర్ను సర్టిఫికెట్లపై ముద్రించనున్నారు.
ఆ పెన్ నంబర్ సహాయంతో విద్యార్థుల డ్రాపౌట్ వివరాలను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులను సులువుగా ట్రాక్ చేసే వీలుంటుంది. ఈ నంబర్ సహాయంతో వారు ఇంటర్, డిగ్రీ, పీజీ పై చదువులు ఎక్కడ చదివారో తెలుసుకోవచ్చు. యూడైస్లో ఉన్నవారికి మాత్రమే సాఫ్ట్వేర్ ద్వారా శాశ్వత నంబర్ను కేటాయి స్తారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నంబర్ కొట్టిన వెంటనే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, చదువు, అధ్యయన వివరాలు తెలుసుకునేలా దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో లేదా దేశంలో వీరు ఒక చోటు నుంచి మరొక చోటుకు వలసలు వెళ్లినా పెన్ నంబర్ను ఉపయోగించి విద్యార్థులను ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది.






