calender_icon.png 31 October, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి డోర్లు తీయలేం.. వీధుల వెంట నడవలేం

31-10-2025 01:59:42 PM

ఇండ్ల మధ్యలో కోతులు..వీధుల వెంట కుక్కలు.

భయంతో ప్రజలు.

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంతో పాటు ఇతర మండలాల్లోని పరిసర గ్రామాల్లో ఇటీవల కాలంగా కుక్కలు, కోతుల బెడద పెరిగిపోతోంది. వీధుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు నడవడమే కష్ట సాధ్యమవుతోంది. ఎటు వైపు నుండి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రెండు జంతువుల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వీధుల్లో కుక్కల గుంపులు తిరుగుతుండగా, వాటి దాడులతో పలువురు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు రోగాలకు కూడా గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, ఇళ్ల పైకప్పుల పై, ప్రహరీ గోడలపై, చెట్లపై, దేవాలయాలు ప్రాంతంలో, అన్నిచోట్ల  తిరుగుతున్న కోతులు పిల్లలపై, మహిళలపై దాడి చేసే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రధానంగా నకిరేకల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ, గీతా మందిరం,ఇతర ప్రాంతాల్లో , గ్రామాల్లో  రాత్రి పగలు అని తేడా లేకుండా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోర్లు తీసి బయటకు వెళ్లలేని పరిస్థితులు దాపరిచాయి. మనుషులపై కోతలు దాడులు చేస్తున్నాయి. మూసిరోడ్డు, తిప్పర్తి రోడ్డు లోని వివిధ కాలనీలో కుక్కలు వీధుల వెంట స్వైర విహారం చేస్తున్నాయి. 

వీధుల వెంట వెళ్తే వెంటపడుతున్నాయి. వాహనాలకు అడ్డంగా వస్తున్నాయి. దింతో  ప్రమాదాలు జరుగుతునాయి. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్న కోతులు ప్రజలకు కలవరాన్ని సృష్టిస్తున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. “రోజు ఉదయం బయటకు వెళ్ళాలంటే భయంగానే ఉంది. కుక్కలు వెంబడిస్తాయో, కోతులు దాడి చేస్తాయో తెలియడం లేదు” అని స్థానికులు వాపోతున్నారు. ప్రజలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. కుక్కల నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు కోతులను అరణ్య ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు బెడదలు తగ్గకపోతే,ప్రజలు రోడ్లపై సంచరించడానికే భయపడే పరిస్థితి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.