13-08-2025 11:09:10 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీంఆసిఫాబాద్(విజయక్రాంతి): వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా రక్షణ చర్యలలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
నదులు, వాగులు ఉదృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయకూడదని కోరారు. పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లకూడదని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్ళకూడదని, రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని, అత్యవసర సమయాలలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని తెలిపారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాల కొరకు 100, జిల్లా ప్రజల సహాయార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నం.8500844365 లో సంప్రదించాలని, 24 గంటలు తక్షణ సహాయం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.
విద్య సంస్థలకు సెలవు....
భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలు,అంగన్వాడి కేంద్రాలకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే,అదనపు కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం సెలవు ప్రకటించారు.దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి.