15-06-2025 12:38:04 AM
ఎమ్మెల్యే ముఠాగోపాల్
ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. శనివారం భోలక్ పూర్ లోని గంగపుత్ర సంఘం కమ్యూనిటీ హాల్లో సొసైటీఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఆర్), జనహిత సేవా ట్రస్ట్, కీమ్స్ ఫౌండేషన్, రెయిన్బోహోమ్స్ కమ్యూనిటీ కేర్ సంస్థల సం యుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
వైద్యశిబిరాన్ని ప్రారం భించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ... ప్రజలు ఆరోగ్యంపట్ల శ్రద్ధవహించాలని సూచించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ప్రభలే అవకాశం ఉందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్పొరేట్ వైద్య సంస్థలు, స్వచ్చంద సంస్థలు మానవత దృక్పదంతో పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారికి మెరుగైన వైద్య సేవలు అందిచాలని కోరారు.
ఈ సందర్భంగా 300ల మందికి ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, చిన్నపిల్లల, దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, నాయకులు గోవింద్రాజ్, ప్రవీణ్, కళ్యాణ్, కృష్ణ, మహేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వెంకటేష్, కోశాధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.