ఈ కామర్స్ వృద్ధిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆందోళన
ఢిల్లీ: దేశంలో ఈ కామర్స్ వేగంగా అభివృద్ధి చెందడం ఆందోళన కరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగ కల్పన, వినియోగదారుల సంక్షేమం పై ఈ కామర్స్ ప్రభావం అనే నివేదిక విడుదల సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కామర్స్ నెట్ వర్క్ వల్ల రాబోయే పదేళ్లలో సగం మార్కెట్ అవే ఆక్రమించడాన్ని విజయంగా భావించొద్దన్నారు. పోటీ నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సాంప్రదాయ రిటైల్ మార్కెట్ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థల వ్యాపార వ్యూహాలపై ఆయన వ్యాఖ్యానించారు. బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారంటే అవి భారత్ ఆర్థక వ్యవస్థకు అండగా నిలిచేందుకు కాదని అర్థం చేసుకోవాలన్నారు. తమ బ్యాలెన్స్ షీట్లో నష్టాలను భర్తీ చేసుకోవడానికే అన్నారు. వాస్తవానికి అవి బిజినెస్ టు కస్టమర్ వ్యాపారాన్ని నిర్వహించకూడదు, కానీ అందరం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లపై కొనుగోలు చేయడానికి అలవాటు పడిపోయామని ఆయన తెలిపారు. పెద్ద పెద్ద రిటైలర్ల వల్ల చిన్న రిటైలర్లు మాయమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






