19-11-2025 01:08:11 PM
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి బాబా(Sathya Sai Baba) జీవితం, బోధనలు, వారసత్వాన్ని గౌరవించే రూ.100 నాణెం, స్టాంపులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) బుధవారం విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో(Sri Sathya Sai District) సాయిబాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా, మోదీ సాయిబాబా మహాసమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రం అన్నారు.భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడు సేవతోనే ముడిపడిఉంటాయని పేర్కొన్నారు.
సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని ఆయన సూచించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని తెలిపారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు.. ఇదే బాబా నినాదం అన్నారు. బాబా బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందని తెలిపారు. కోట్ల మంది బాబా భక్తులు మానవసేవ చేస్తున్నారని సూచించారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని ప్రధాని పేర్కొన్నారు. చాలా మంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని చెప్పారు. లక్షలమందిని బాబా సేవామార్గంలో నడిపించారని తెలిపారు. సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. 20 వేల మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోజన అందించారని తెలిపారు. బాలికల ప్రగతిలో సురక్ష సమృద్ధి యోజన కీలకమైందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన అబ్ధిదారుల సంఖ్య వంద కోట్లకు చేరిందన్నారు.