19-11-2025 10:15:53 AM
విజయవాడ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (Andhra-Odisha border)లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య బుధవారం తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్ జరిగిందని ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG)మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మిగిలిన మావోయిస్టులు భద్రత కోసం లొంగిపోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం(Rampachodavaram)అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లోనూ అగ్రనేతలు చనిపోయినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. ఏపీలోని కోనసీమ జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. హిడ్మా(Madvi Hidma) అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రావులపాలెంలో హిడ్మా అనుచరుడు దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్- తెలంగాణ నుండి మావోయిస్టు గ్రూపులు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని, దీని వలన నిఘా పెరిగిందన్నారు. నిన్న ఉదయం అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మరో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.