23 March, 2026 | 4:08 PM

పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన

23-03-2026 02:31 PM

లోక్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం

దేశంలో సరిపడా నిల్వలున్నాయి

ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా... భారత్ పై ప్రభావం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం(West Asia War) వేల దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) లోక్ సభలో ప్రసగించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు. ఆర్థిక అంశాలపై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని  ప్రధాని మోదీ వెల్లడించారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచి ముడిచమురు, గ్యాస్ వస్తోందని ప్రధాని వివరించారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని ఆయన వెల్లడించారు.

ముడిచమురు సముద్ర మార్గం ద్వారానే మనం తెచ్చుకుంటున్నామని తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చామని వివరించారు. గల్ఫ్ దేశాల్లోని  భారతీయుల భద్రతపై నిరంతరం చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో చదివే మన దేశ పిల్లల భద్రతకు ఇబ్బంది లేకుండా చూశామని పేర్కొన్నారు.

భారత్ కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచి వస్తాయని చెప్పారు. సంక్షోభ సమయంలో దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామని సూచించారు. ముడిచమురు, ఎల్ పీజీని గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపిన ప్రధాని మోదీ ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని దేశ ప్రజలకు తెలిపారు. ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇతర దేశాలతో నిరంతరం చర్చలు జరిపామన్నారు. మన నౌకలు సురక్షితంగా భారత్ కు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

ప్రస్తతం పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నామని వెల్లడించారు. రైల్వేలో విద్యుదీకరణ వల్ల డీజిల్ వినియోగం బాగా తగ్గిందని సూచించారు. దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు, ఇతర వాహనాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈవీ వాహనాలు భవిష్యత్తులో మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడ సమస్యల వచ్చినా భారత్ పై ప్రభావం పడుతోందని తెలిపారు. భారత్ పై ప్రభావం పడకుండా మనం స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఎగుమతులు, దిగుమతులపై నిరంతరం సమీక్ష జరుపుతున్నామన్నారు.

ఈ యుద్ధాల ప్రభావం రైతులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. యూరియా ధర పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో 6 యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నామని సూచించారు. ప్రకృతి సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని మోదీ వెల్లడించారు. పొలాల్లో డీజిల్ ఇంజిన్ల వినియోగం తగ్గించే కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వరసగా రెండో ఏడాది కూడా వంద టన్నుల బొగ్గు వెలికితీశామని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పారు. సూర్యఘర్ యోజనతో అనేకమందికి లబ్ధి కలుగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.