25-11-2025 08:25:55 AM
న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ్ లల్లా ఆలయంలో(Ram Janmabhoomi) నేడు పవిత్ర ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతోంది. ధ్వజారోహనం కార్యక్రమానికి ప్రధాని మోదీ(PM Modi) హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సప్తరుషి మందిరానికి మోదీ వెళ్లనున్నారు. సప్తరుషి మందిర దర్శనానంతరం శేషావతార మందిరానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు అన్నపూర్ణాదేవి మందిరాన్ని దర్శించుకోనున్నారు. రామ్ లల్లా మందిరాన్ని దర్శించి ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రామ్ లల్లా మందిర శిఖరంపై ధ్వజారోహణం చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేయనున్నారు. కాషాయరంగు గల ధర్మధ్వజాన్ని ప్రధాని ఎగరవేయనున్నారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్లు చిహ్నాలున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారు. మోదీ అయోధ్య పర్యటన దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.