ముంపు ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన
బూర్గంపాడు,(విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్తో తెలంగాణలోని గోదావరి తీరప్రాంతాల్లో ప్రభావం కలిగించే పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం (పీపీఏ) బుధవారం మండలంలో పర్యటించింది. తొలుత ఐటీసీ గెస్ట్హౌజ్ చేరుకున్న బృందం స్థానికంగా ఉన్న కేంద్ర జలసంఘం, నీటి పారుదల విభాగం అధికారులతో సమీక్షించి అనంతరం బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని కొల్లు ప్రాంతంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో రెండు ప్రాంతాల్లో పర్యటించి ముంపునకు గల కారణాలపై అధ్యయనం చేశారు. అదేవిధంగా అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ను బృందం సందర్శించి అక్కడ వరద ప్రవాభం ఏ మేరకు ఉందో అక్కడి వారిని అడిగి తెలుసుకుని అధ్యయనం చేశారు.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధ్యయనం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ తో ప్రధానంగా బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలకు సమస్య ఉందని, అటు భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉండి ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నట్లు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. పరిశీలన చేసిన బృందంలో పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, ఎంఎస్ రఘురాం, సీఈ రమేశ్, డైరెక్టర్ సతీష్, డిప్యూటీ డైరెక్టర్లు ప్రవీణ్, రవి, శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ ఎస్ఈ సుబ్రమణ్యప్రసాద్, ఈఈలు వెంకటేశ్వరరావు, మమ్మద్ జాని, డీఈలు శ్రీనివాస్, మధుసూదన్రావు పాల్గొన్నారు.






