31-05-2025 10:08:29 PM
10 కేసులు నమోదు, 9 మంది రిమాండ్...
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా అమాయక ప్రజలను మోసం చేస్తూ, వారిని బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడుతూ, వారి వద్ద డబ్బులు వసూలు చేసే భూ బకాసురుల పట్ల కఠినంగా వ్యవహరిస్తునట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) తెలిపారు. గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదులలో 10కి పైగా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 9 మందిని రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా అమాయక ప్రజలను కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల హస్తంతో మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ప్రజలను మోసం చేస్తూ ఎక్కువ కాలం ముసుగులో బతకలేరని ఫిర్యాదులు వచ్చిన వెంటనే వారిపట్ల కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు అక్రమార్కుల ఆటలు కట్టడి చేయడం జరుగుతుందన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, చట్టలలో ఉన్న లోసగులను వాడుకొని కేసులను నమోదు చేయడం వారిని బ్లాక్ మెయిల్ చేయడం, చట్టాలను దుర్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, ఫేక్ డిపెండెంట్ సర్టిఫికెట్లను సృష్టించి ఆస్తులను కబ్జా చేయడం, నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేయడం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.