21-10-2025 07:19:17 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం 'ఫ్లాగ్ డే' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ పోలీసుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. దేశమంతా ప్రజలు పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని తెలిపారు. అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు.
పోలీసు కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగానే ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో 47 మంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. అనంతరం అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు వెంకటరమణ, భీం రావులతో పాటు కమీషనరేటులోని పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.