డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు
చివ్వెంల,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు, సైబర్ నేరాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని చివ్వెంల పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ కే. నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు చివ్వెంల మండల కేంద్రంలోని దూరాజ్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఎస్ఐ-2 వెంకన్న విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ-2 వెంకన్న మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, ఓటీపీ, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయరాదన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, షీ టీమ్స్ సేవలపై కూడా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై వేధింపులు జరిగితే వెంటనే 100కు లేదా సూర్యాపేట షీ టీమ్ నంబర్ 8712686056కు సమాచారం అందించాలని కోరారు.






