10-05-2025 01:35:24 AM
ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం (భూపాలపల్లి), మే 9 (విజయక్రాంతి) : జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ సౌజన్యంతో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎస్పీ ప్రత్యేక చొరవతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 650 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబ సభ్యులకు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి, ఉచితంగా మందులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరని అన్నారు. పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి వారి కుటుoబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించిన యశోద హాస్పిటల్ వైద్యులకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పి బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పి వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, సీఐలు, నరేష్ కుమార్, మల్లేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రత్నం, నగేష్, శ్రీకాంత్, కిరణ్, యశోద డాక్టర్లు మాజిద్, లోకేశ్వరి, శ్రావ్య, సింధు, నవీన్, లిఖిషా, సాయి దుర్గా జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.