28 April, 2026 | 2:19 AM

42% రిజర్వేషన్లపై పార్టీలకు చిత్తశుద్ధి లేదు

28-04-2026 12:08 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో లేదని, త్వరలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరపడానికి పాత పద్దతిలో చర్యలు  తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ మేరకు సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్‌లో మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కొందరు క్యాబినెట్ మంత్రులు, కలెక్టర్లు, సంబంధిత అధికారులకు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోందని, ఈ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసినట్లు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీ లకు 17 శాతం రిజర్వేషన్లు తగ్గించి, మున్సిపల్ ఎన్నికలలో 28 శాతం రిజర్వేషన్లు తగ్గించి అమలుచేసి బీసీలకు తీరని ద్రోహం చేశారన్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ బీసీల పక్షాన మాట్లాడలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కొంద రు నాయకులు మహేష్ గౌడ్‌తో సహా హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ మాత్రమే బీసీల పక్షాన గట్టిగా మాట్లాడుతున్నారన్నారు.  సీఎం కొందరు నాయకులను, మీడియాను బెదిరించి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తే ఎన్నో రోజుల నడవదని హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వ కుండా అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.