12-12-2025 12:00:00 AM
షాద్ నగర్, డిసెంబర్ 11: షాద్ నగర్ నియోజకవర్గంలో పాటు శంషాబాద్ పరిధిలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు ఇలాగే సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలలో కలిపి 168 గ్రామాలలో ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. అనుకున్న విధంగానే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైందని ప్రతి చోట 60 నుంచి 90% పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకే 24 % పోలింగ్ జిల్లాలో నమోదయిందని షాద్ నగర్ ప్రాంతంలో కొన్నిచోట్ల 10 గంటలకే 50% పోలింగ్ నమోదయిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, పోలీసులు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తు న్నారని ప్రశంసించారు. ఒంటిగంట వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, తరువాత ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేదాకా ప్రజలు ఇలాగే తమ సహకారాన్ని అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఎలా జరుగుతుందన్నది ఆయన పరిశీలించారు.
లాఠీఛార్జ్ గురించి తెలియదు..
నందిగామ మండలం మామిడిపల్లిలో జరిగిన లాఠీ చార్జ్ వ్యవహారం తన దృష్టికి రాలేదని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఉదయం గ్రామంలో జరిగిన సంఘటన గురించి మీడియా ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ అలాంటివేవీ తన దృష్టికి రాలేదని, దానికి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత చర్యలు చేపడతానని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో నందిగామ మండల కేంద్రంలోని కొన్నిచోట్ల విపరీతంగా జన సందోహం ఉందని, మిగితాచోట్ల క్రమంగా పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మధ్యాహ్నం కల్లా పూర్తిస్థాయిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుం దని ఆశిస్తున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న సమీపంలో ఉన్న పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. ఆర్డీవో సరిత, తహసిల్దార్ పార్థసారథి తదితరులు ఆయన వెంట ఉన్నారు..