23 April, 2026 | 7:44 PM

5 గంటల వరకు తమిళనాడులో 82.24, బెంగాల్‌లో 89.93 శాతం పోలింగ్

23-04-2026 06:00 PM

చెన్నై: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling Percentage) కొనసాగుతోంది. తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదు కాగా, బెంగాల్ లో సాయంత్రం 5 గంటలకు వరకు 89.93 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభం కాగా, నటి త్రిష కృష్ణన్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సరసన చేరిన త్రిష, ఆకుపచ్చ రంగు 'కార్డ్ సెట్' దుస్తులు ధరించి పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం కనిపించింది. నటుడు విజయ్ సేతుపతి కూడా చెన్నైలోని కిల్పాక్ హైస్కూల్‌లో ఉన్న అన్నానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. 

తమిళనాడులోని రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల చిన్నకడై ప్రాంతంలో, ఒకే కుటుంబానికి చెందిన రెండు నూతన వధూవరుల జంటలు  గురువారం ఉదయం తమ వివాహ వేడుకలు ముగిసిన వెంటనే పెళ్లి దుస్తులు, పూలమాలలతోనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా, కోయంబత్తూరులోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఒక ప్రత్యేక రోబో, ఓటర్లకు స్వాగతం పలుకుతూ, స్వీట్లను పంపిణీ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగాల్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణలు జరిగాయి.

Tamil Nadu: Approximate voter turnout – 82.24%

West Bengal (Phase 1): Approximate voter turnout – 89.93%