14-07-2025 10:55:23 PM
వెంకటాపురం, వాజేడు మండలాల్లో 'ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్-తెలంగాణ' పేరుతో విడుదల
ప్రజల జీవన మార్గాన్ని స్వీకరించాలంటూ విజ్ఞప్తి..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District)లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. నక్సల్స్ చలనంపై మరోసారి చర్చ మొదలైంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ప్రధాన కూడళ్లలో “ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్- తెలంగాణ" పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రస్తావించిన సందేశం నూతనంగా, ఆత్మ విమర్శాత్మకంగా ఉండటం గమనార్హం. పోస్టర్లలో 'సిద్దాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా అంటూ ప్రారంభమవుతూ, 40 ఏళ్లుగా మావోయిస్టులు నమ్మిన సిద్ధాంతం సామాన్య ప్రజలకు ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా ప్రశ్నను లేవనెత్తారు. కాలంతో కలిసి మారని ఉద్యమాలు ఎలా ప్రజల మద్దతును కోల్పోతాయో, ఒకప్పుడు ధ్యేయంగా భావించిన మార్గాలు ఎలా జనాభావాలను దూరం చేసుకు న్నాయో ఈ సందేశం హృద్యంగా వివరించుకుంది.ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న ఉద్యమబాట మోడువారిన బీదులా మారిందని ఉద్యమ వైఫల్యాన్ని పరోక్షంగా గుర్తించారు.