calender_icon.png 3 June, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశానికి ప్రభాకర్‌రావు

02-06-2025 01:43:05 AM

  1. అమెరికా నుంచి రాబోతున్నట్టు ప్రకటించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1
  2. 5న విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం
  3. విచారణకు సహకరిస్తానని సుప్రీంకోర్టుకు లేఖ ద్వారా స్పష్టీకరణ

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ1గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి స్వదేశానికి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరుకాబోతున్నట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు ఆదివారం ముందస్తు సమాచారం అందజేశారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ లెటర్‌ను కూడా మెయిల్ ద్వారా ప్రభాకర్‌రావు పంపారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగివస్తానంటూ మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ మే 2వ తేదీన తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభాకర్‌రావు సవాలు చేస్తూ మే 9వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే తాను అమెరికా వెళ్లినట్టుగా ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయకూడదంటూ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. దీంతోపాటు ఆయనకు వీలైనంత త్వరగా పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పాస్‌పోర్ట్ అందిన 3 రోజుల్లో భారత్‌కు వచ్చి విచారణకు పూర్తి సహకరించాలని ప్రభాకర్‌రావుకు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 5కు వాయిదా వేసింది.