బోడుప్పల్ సర్కిల్లో ప్రజా పాలన - ప్రగతి కార్యక్రమం
గృహ నిర్మాణ, కూల్చివేతల వ్యర్ధాలను రాంకీ సంస్థకు అందజేయాలి: డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకముగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మార్గదర్శకత్వంలో బోడుప్పల్ సర్కిల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కన్స్ట్రక్షన్ మరియు డిమాలిటేషన్ వ్యర్థాలను షెడ్యూల్ ప్రకారం సేకరించి తరలించే కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ, డిఇఇ (ఎస్డబ్ల్యూఎమ్) కె. జాహ్నవి శశాంక్ తో కలసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ... గృహ నిర్మాణం మరియు కూల్చివేత పనుల వల్ల వచ్చే వ్యర్థాలను రోడ్ల పక్కన వేయకుండా, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ వ్యర్థాలను రాంకీ సంస్థ ద్వారా ప్రతి టన్నుకు రూ.420 ఫీజు చొప్పున సేకరించి తరలిస్తామని తెలిపారు. కావున పట్టణ గృహ నిర్మాణ దారులు ఇట్టి వ్యర్థలను రాంకీ సంస్థకు అందచేయాలని, ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.




