25 May, 2026 | 5:37 PM

అధికారులు మారరు... ప్రజావాణి సమస్యలు తీర్చరు

25-05-2026 05:07 PM

ప్రధాన శాఖల అధికారుల డుమ్మా

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమంగా మారింది. ప్రధాన శాఖలైన రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి ,ఎక్సైజ్, పశు వైద్యాధికారి, వైద్య అధికారులు డుమ్మా కొట్టారు. ఉదయం 10:30 గంటల నుండి ఒంటిగంట వరకు ప్రజల నుండి అర్జీలు స్వీకరించాల్సి ఉండగా విద్యాధికారి, వ్యవసాయ అధికారి కాసేపు ఉండి వెళ్ళిపోయారు.

 ఎం పీ ఓ రతన్  సింగ్, ఏపీఎం శివయ్య, ఏపీఓ నర్సింలు, అర్జీలను స్వీకరించారు. డిజేబులిటీ మరియు రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూర యాదయ్య, చాంద్ పాషా, మల్లప్ప లు వికలాంగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ తమకు అప్పగించాలని అర్జీ ఇచ్చారు. ఒకే ఒక్క అర్జీ రావడంతో ప్రజలకు సమస్యలు లేవనా? ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కావనా? అధికారులపై నమ్మకం  లేకుండా పోతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో తిరుమల స్వామి మాట్లాడుతూ నేను మరియు తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ జిల్లా కేంద్రంలో జరిగిన అధికారిక సమావేశానికి వెళ్ళామని ప్రజావాణికి గైరాజరైన అధికారులపై కలెక్టర్కు నివేదిక అందిస్తామని తెలిపారు.