25-09-2025 09:07:43 PM
సనత్నగర్,(విజయక్రాంతి): రానున్న దసరా, బతుకమ్మ పండుగలకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నమన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ విషయంలో బాలానగర్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఏసీపీ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు.పండుగలకు ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను చేదించామని, ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.
ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి
విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.బీరువా, లాకర్ తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్తే మంచిది.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ తో మూసివేయాలి.గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.రద్దీగా ఉన్న బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు, తమ విలువైన వస్తువులను తమ వద్ద జాగ్రత్త పరుచుకోవాలి, బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు. ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.
హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు (షాయోమీ వంటి కంపెనీలు తక్కువ ధరకే) ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్ గోద్రెజ్ హై సెక్యూరిటీ లాక్ సిస్టం ని వాడడం మంచిది. తాళం వేయడం కంటే గోద్రెజ్ డోర్ లాక్ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా? లేరా? అనేది తెలియదు.
ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి. కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలి.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని కోరారు.