16-02-2026 12:45:02 AM
డాక్టర్ నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట ఆందోళన
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 15 : వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన గాడిచర్ల అశ్విని, గణేష్ దంపతులు. గర్భవతి అయిన అశ్విని సిద్దిపేటలోని మానస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్... గర్భస్థ శిశువు సరిగా పెరగడం లేదని, ఆపరేషన్ చేసి తొలగించాలని సూచించారు.
అబార్షన్ చేస్తున్న క్రమంలో అశ్వినికి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యురాలు సూచించారు. అక్కడ చికిత్స పొందుతుండగా అశ్విని మృతి చెందారు. మానస ఆస్పత్రి వైద్యురాలు నిర్లక్ష్యం కారణంగానే అశ్విని మృతి చెందిందని బంధువుల ఆరోపించారు. మృతదేహంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.