16-02-2026 12:46:36 AM
హైదాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శైవాలయాలు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. ఓం నమ: శివాయ’, హర హర మహాదేవ శంభో శంకర నినాదాలతో దేవాలయ ప్రాంగణాలు పవిత్రత్వంతో నిండిపోయాయి. పాలాభిషేకాలు, రుద్ర పారాయణాలు, జాగరణ సేవలతో భక్తులు తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ పరమశివుని కృపాకటాక్షం కోసం ప్రార్థించారు.
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం, ములుగు జిల్లా రామప్ప, భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, మహబూబాబాద్ జిల్లా కొరవి వీరభద్ర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము 2.20 గంటల నుంచే మొదటి దర్శనం ప్రారంభమైంది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల మహా జాతరను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున వనదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కదిలి పాప అన్నపూర్ణేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి భక్తజనం పోటెత్తారు.