20-06-2025 12:00:00 AM
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు కిందపడి దుర్మరణం
రాజేంద్రనగర్, జూన్ 19: రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందిన విషాదకర సంఘటనఅత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 198 వద్ద గురువారం సాయంత్రం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆమె బస్సు కిందపడి దుర్మరణం పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాలానగర్ ప్రాంతానికి చెందిన మునీర్, సయ్యద్ ఆశ్రఫ్ దంపతులు తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి గురువారం సాయంత్రం ఆరంఘర్ వైపు స్కూటీపై వెళ్తున్నారు.
ఈ క్రమంలో పిల్లర్ నంబర్ 198 సమీపంలో ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి కారును నిలిపాడు. అతడు నిర్లక్ష్యంగా కారు డోరు తీస్తుండగా మునీర్ ఒక్కసారిగా గమనించి స్కూటీని తిప్పాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న బస్సు స్కూటీని ఢీకొనడంతో బస్సు కింద పడింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆమె వెంటనే తన నాలుగేళ్ల కూతురును పక్కకు పడేయడంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది.
భర్త మునీర్ కళ్ళేదుటే అశ్రఫ్ మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతి చెందిన అశ్రఫ్ గర్భిణీ. ఆమె మృతితో స్థానికులు ఒక్కసారిగా గుమ్మిగూడారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.